Friday, August 26, 2011

నేను చూసిన దేశాలు

మాది కరీంనగర్ జిల్లా లోని ధర్మపురి మండలం, పవిత్ర  గోదావరి తీరాన ఉన్న తిమ్మాపూర్ గ్రామం. పుట్టింది, పెరిగింది కరీంనగర్లో. ఓనమాలు దిద్దింది, స్కూల్ ప్రవేశం మా ఊర్లో మరియు ప్రక్కనే ఉన్న ధర్మపురిలో.  విద్యాభ్యాసం అంతా కరీంనగర్ పట్టణంలో, తర్వాత కాలేజీ చదువులకు  హైదరాబాద్, ఆ తర్వాత  1975 లో  పై  చదువులుకు అమెరికన్ యూనివర్సటీ ఆఫ్ బీరూట్ మరియు ఇంగ్లాండ్. అటు తర్వాత డెబ్బై, ఎనభై  దశకాల్లో ఉద్యోగరీత్యా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, రిసెర్చ్ సైంటిస్ట్  గా,  కన్సల్టంట్ గా,  సౌది అరేబియా ప్రభుత్వ సలహాదారుగా   సుమారు పదిహేను సంవత్సరాలు వివిధ దేశాల్లో గడపడం. ఆ సమయంలోనే 1979 లో అనంతలక్ష్మి తో వివాహం, కుమారుడు శ్రీకర్, కూతురు మహతి పుట్టడం, ఎనభై  దశకం చివర్లో ఇండియా రావడం, బిజినెస్ లో ఒడుదొడుకులు, కష్టంగా అధిగమించడం; మళ్ళీ ప్రొఫెషనల్ రంగానికి వచ్చి, వ్యవసాయ రంగంలో, అంతర్జాతీయ సంస్థలకు ఇప్పటివరకు సలహాదారుగా పనిచేస్తు ఉండడం, కొద్దిగా  రియల్ ఎస్టేట్ రంగంలోకి తొంగి చూడడం, పిల్లల చదువులు, వారి వివాహాలు, పిల్లలందరూ ప్రస్తుతం అమెరికాలో, ఈ మద్యనే మా మహతికి "రూహి" పుట్ట్టడం, హమ్మయ్య..................

ఈ  సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు, ఆలోచనలు, అనుబంధాలు,  ఆత్మీయతలు, అపార్థాలు, అంతరార్థాలు, రాగద్వేషాలు కూడా ......తప్పవు కదా....అవమానాలు......మన ప్రమేయం లేకున్నా అప్పుడప్పుడు అవి కూడా తప్పవు కదా;  కొన్ని అపజయాలు, అవరోధాలు ......అధిగమించాను లెండి....           
ఎవరో కవి అన్నట్లు
" కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం
రెప్ప పాటు కాలమే కదా ఈ జీవితం "
మరి ఈ రెప్పపాటు కాలం కూడా పూర్తి కాలేదు... సుదీర్ఘ ప్రయాణం ఎలా అవుతుంది.!!!  ఏదో లెండి. నా ఈ చిన్న ప్రయాణంలోని కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ప్రయత్నిస్తాను. టెక్నాలజీ, పోలిటిక్స్, సాహిత్యం, పర్యటనలు ...............ఏం వ్రాద్దామా అని ఆలోచిస్తువుంటే ..............గత ముప్పై ఏళ్లలో మేము అనేక ఖండాలలో సుమారు ఇరవయి దేశాలకు వెళ్ళాము. మళ్లీ ఎవరో కవి అన్నట్లు .................
" కాళ్ళు తడవకుండా సప్తసముద్రాల్ని దాటగలిగిన మనిషి
కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు ".
అంత సీరియస్ గా కాకున్నా, కొన్ని  దేశాల లోని జీవనాన్ని, గొప్పతనాన్ని చూసి ఆనందంతో కళ్ళు చమర్చకుండా కానీ, ఆఫ్రికాలోని కొన్ని దేశాల పేదరికాన్ని చూసి కళ్ళు తడపకుండా కాని  ఉండలేము కదా. అందుకే మొదటగా కొన్ని దేశాల గురించి మా అనుభవాలను పంచుకోవాలని " నేను చూసిన దేశాలు " ప్రారంభిస్తున్నాను.


మొదట బ్రజిల్ పర్యటన గురించి వ్రాస్తాను. మీకు ఆసక్తికరంగా  కూడా ఉంటుందని ఆశిస్తాను.

మీ
దేవి ప్రసాద్ జువ్వాడి

Friday, August 12, 2011

నా పరిచయం

నా పేరు దేవి ప్రసాద్.

          గత 5 సంవత్సరాలుగా  నేను తెలుగు బ్లాగులు చదువుతున్నాను. ఈమధ్య ఒక బ్లాగులొ సి.బి. రావు గారి ఫొన్ నంబర్ చూసి వారితొ ఫొన్లొ మాట్లాడి పరిచయం చేసుకున్నాను.  వారు నన్ను కలుస్తానని అంగీకరించడముతో వారి ఇంటికి వెళ్ళి కలిసాను. నాకు  ఉన్న అభిరురుచులను అందరితో పంచుకోవాలని చెప్పి, నేను ఒక బ్లాగ్ ప్రారంభిస్తానని చెప్పాను. వారి సహయంతో  ఈ  బ్లాగ్ మీ ముందుకు తెస్తున్నాను. కొద్ది రొజుల్లో  నా గురించి  పూర్తి వివరాలు తెలుపగలను.  అంతవరకూ   సెలవు.    

నమస్కారాలు,

మీ,

దేవి ప్రసాద్ జువ్వాడి